వార్డుల పునర్విభజనకు పచ్చజెండా
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:37 PM
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా
హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉత్తర్వులు
కర్నూలు నగర పాలక సంస్థలో 68కి చేరిన వార్డులు
నేడు నోటిఫికేషన్ జారీ
11 వరకు సూచనలు, సలహాలు స్వీకరణ
నగరంలో వేడెక్కిన రాజకీయం
వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన ఫిటిషన్లను హైకోరు కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం పురపాలక శాఖ డైరెక్టర్ (డీఎంఏ) షెడ్యూల్ జారీ చేశారు. నేడు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 11వ తేది వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ప్రస్తుతం నగర పాలక సంస్థ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి. వాటిని 68కి పెంచారు. వాస్తవంగా ఏప్రిల్లోనే వార్డుల పునర్విభజన జరగాల్సి ఉంది. ప్రస్తుతం జనగణన (సెన్సెస్) జరుగుతున్న సమయంలో వార్డుల పునర్విభజన చేపట్టడం సరికాదంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. వారించిన న్యాయస్థానం ఆ ఫిటిషన్ను కొట్టివేసింది. కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపుతూ షెడ్యూల్ జారీ చేసింది. నగరంలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఆ వివరాలపై ‘ఆంరఽధజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు/కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ పురపాలక సంఘాలు, గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు నగర పంచాయతీలు ఉన్నాయి. ఆయా నగర, పురపాలక సంస్థల్లో 307 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. పాలకవర్గం పదవి కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. నిబంధనలు మేరకు 6 నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా వార్డుల పునర్విభజన కోసం గత ఏప్రిల్ నెలలో షెడ్యూల్ జారీ చేసింది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రక్రియ చేపట్టారు. కర్నూలు నగరంలో కూడా 52 వార్డులను 68 వార్డులకు పెంచారు. ఒక పక్క జనగణన (సెన్సెస్) జరుగుతుండగా వార్డుల పునర్విభజన చేపట్టడం వల్ల సెన్సె్సకు అడ్డంకిగా మారుతుందని, ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ సరిహద్దులను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ జానాభా లెక్కలు సేకరణ కోసమే పరిమితం చేసింది. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియతో వార్డుల పునర్విభజనకు ఎలాంటి భంగం కలగదు. స్థానిక ఎన్నికల ఓటింగ్కు ఎలాంటి సంబంధం లేదు అని న్యాయస్థానం పేర్కొంది. వార్డుల విభజన వల్ల నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల భౌగోళిక సరిహద్దులు మారవని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో మళ్లీ వార్డుల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాజకీయ వేడి రాజకుంది.
ఒక్కో వార్డులో 7,025 మంది జనాభా
ప్రస్తుతం ఒక్కొ వార్డులో 10 వేలకు పైగా జనాభా ఉన్నారు. కొన్ని వార్డుల్లో 15 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసమానతలను సరి చేస్తూ ప్రభుత్వం వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. 2011లో కర్నూలు నగరపాలక సంస్థ జనాభా 4.77 లక్షలు ఉంది. 68 వార్డులకు విభజిస్తే 7,025 మందికి ఒక వార్డు ఉండేలా భౌగోళికంగా ఇబ్బందులు రాకుండా విభజనకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే.. వివిధ కాలనీల్లో భౌగోళిక స్వరూపం మారకుండా పది శాతం జనాభా ఎక్కువ, తక్కువ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
68కి చేరిన వార్డులు
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం 52 వార్డులు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డుల సంఖ్యను పెంచలేదు. జనాభా పెరుగుతున్నా.. పాత వార్డులతో ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నగర, పురపాలక సంస్థల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాకు అనుగుణంగా డివిజన్లు, వార్డులు పునర్విభజనకు మే 24న ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు 64 జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు కర్నూలు కార్పొరేషన్లో 52 నుంచి 68 వార్డులకు పెంచారు. కొత్తగా 16 వార్డులు పెరిగాయి. అందులో కర్నూలు నియోజవకర్గంలో 9, పాణ్యం నియోజకవర్గంలో 6, కోడుమూరు నియోజకవర్గంలో ఒకటి చొప్పున కొత్తగా వార్డులు పెరుగనున్నాయి.
నగరంలో రాజకీయ వేడి
వార్డుల పునర్విభజనను సవాల్ చూస్తూ కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో, న్యాయస్థానం స్టే ఇస్తే నగరపాలక సంస్థ ఎన్నికల జరిగే అవకాశం ఉంకడపోవచ్చని రాజకీయ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అదృష్టాన్ని పరిక్షించుకోవాలనే ఆశావహులు భావించారు. పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. రిజర్వేషన్ల మార్పులు, కొత్తవార్డుల ఏర్పాటు, ఓటర్ల విభజన, పాత వార్డుల విలీనాలు వంటి అంశాలు స్థానిక నేతల భవిష్యత్తుపై ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అదే క్రమంలో పోలింగ్ కేంద్రాలు కూడా మారే అవకాశం ఉంది.
ప్రజల నుంచి సలహాలు, సూచనలు
వార్డుల పునర్విభజనకు నేడు నోటిషికేషన్ జారీ చేస్తున్నారు. 11వ తేది వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వకరిస్తారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభాను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వార్డులను పునర్విభజన చేస్తూ ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేస్తారు. ప్రజల ఆమోదం కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడంతో పాటు పరిష్కరించి పరిష్కరించి, ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ గెజిట్ నోఫికేషన్ జారీ చేస్తుంది.
వార్డుల పునర్విభజన షెడ్యూల్ ఇలా
నోటిఫికేషన్ పబ్లిష్ : 5వ తేదీ
అభ్యంతరాలు, సూచనలు స్వీకరణ : 11 వరకు
డీఎంఏకు నివేదిక సమర్పణ : 12న
పునర్విభజన వార్డుల ప్రకటన : 13న
ఏపీ గెజిట్ జారీ : 14న
కర్నూలు కార్పోరేషన్లో
నియోజవర్గం వారిగా వార్డుల వివరాలు
నియోజకవర్గం విభజనకు విభజన కొత్తగా పెరిగిన
ముందు తరువాత వార్డులు
కర్నూలు 33 42 9
పాణ్యం 16 22 6
కోడుమూరు 3 4 1
మొత్తం 52 68 16