వార్డుల పునర్విభజనకు పచ్చజెండా
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:31 PM
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా
కొత్తగా డివిజన్లు, వార్డులు 64
ఉమ్మడి జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలు
307 నుంచి 371కి పెరిగిన డివిజన్లు, వార్డులు
26వ తేదీ నుంచి మే 2 వరకు అభ్యంతరాల స్వీకరణ
మే 3న తుది నోటిఫికేషన్ జారీ
నగర, పురపాలక, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు షెడ్యూలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థతో సహా ఎనిమిది పురపాలక, నగర పంచాయతీల్లో ప్రస్తుతం 307 వార్డులున్నాయి. వీటిని 371కి పెంచారు. తాజా నిర్ణయంతో 64 డివిజన్లు, వార్డులు కొత్తగా పెరిగాయి. నగర పాలక, పురపాలక కమిషనర్లు ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేస్తు న్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న పలువురు నాయకులకు రాజకీయ నిరుద్యోగం తీరనుంది. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ పురపాలక సంఘాలు, గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు నగర పంచాయతీలున్నాయి. ప్రస్తుతం ఆయా నగర, పురపాలక సంస్థల్లో 307 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. ఇటీవలే పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ఆయా పురపాలక సంస్థలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. 2011 జనాభా లెక్క ల ప్రకారం జనాభాకు అనుగుణంగా డివిజన్లు, వార్డులు పునర్విభజనకు కూటమి ప్రభు త్వం గతనెల 24న జీవో:64 జారీ చేసింది. ఎంత జనాభాకు ఎన్ని వార్డులో ఉండాలో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
మార్గదర్శకాలు విడుదల
వార్డుల పునర్విభజనకు సంబంధిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడదల చేసింది. నగర, పురపాలక సంఘాల్లో ఉన్న జనాభా, భౌగోళిక విస్తీర్ణం పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం జారీచే సిన మార్గదర్శకాల మేరకు వార్డులను పునర్విభజన చేస్తూ కమిష నర్లు ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేయాలి. ప్రజల ఆమో దం కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసి, ఫిర్యాదులు, సూచన లు స్వీకరించాలి. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, ప్రభుత్వానికి తుది నివేదిక పంపాల్సి ఉంటుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఈమేరకు గురువారం నుంచి మున్సిపల్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.
రాజకీయ నిరుద్యోగులకు భలే ఛాన్స్
రాజకీయాలపై ఆసక్తి, స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే తపన ఉన్నా, అనుకూలమైన డివిజన్లు, వార్డులు లేకపోవడంతో పలువురు యువ నాయకులు నగర, పురపాలక ఎన్నికలకు దూరం అవుతున్నారు. వార్డులు కూడా తక్కువగా ఉండడంతో ఆశావహులకు వార్డులు సర్దుబాటు చేయలేక నియోజకవర్గం స్థాయి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజకీయ నిరుద్యోగులు, ఆశావహులు ఇది భలే ఛాన్స్ అంటూ అప్పుడే విభజిత వార్డులపై ఫోకస్ పెట్టారు.
ముఖ్య మార్గద్శకాలు
1995 నాటి మున్సిపల్ నిబంధనల మేరకు వార్డుల భౌగోళిక స్వరూపాన్ని పరిగణలోకి తీసుకొని పునర్విభజన చేయాలి. వార్డుల విభజన ముసాయిదా (డ్రాఫ్ట్) ప్రచు రించిన తరువాత ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలి.
ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు స్వీకరించాలి.
వార్డుల సహజ సరిహద్దులు, భౌగోళిక పరిస్థితులు, ఆ ప్రాంతం యొక్క విశిష్టతను కాపాడుతూ, ప్రతిపాదిత వార్డుల్లో జనాభా సమానంగా ఉండేలా విభజించాలి.
ముసాయిదా తయారీ, తుది నోటిఫికేషన్ జారీ షెడ్యూల్
ఈ నెల 2 నుంచి 9 వరకు : ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేయడం
10న : ప్రాధమిక నోటిఫికేషన్ జారీ
10 నుంచి 16 వరకు : ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరణ
17 నుంచి 21 వరకు : ప్రజల అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని, వార్డుల విభజన ప్రతిపాదనను జిల్లా కలెక్టర్కు సమర్పించాలి
22 నుంచి 25 వరకు : ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ పరిశీలించి, ఆ నివేదికను మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ (డీఎంఏ)కు పంపాలి
26 నుంచి మే 2 వరకు : ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, జిల్లా కలెక్టర్ల నివేదిక, మున్సిపల్ కౌన్సిల్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వార్డుల విభజన ప్రతిపాదన ఆమోదం
ఏప్రిల్ 3 నుంచి 5 వరకు : తుది నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచూరిస్తారు
ఉమ్మడి జిల్లాలో నగర, పురపాలక సంస్థల్లో
ప్రస్తుత వార్డులు, కొత్త వార్డుల వివరాలు
నగర/పురపాలక/ ప్రస్తుతం ఉన్న కొత్తగా నిర్ణయించిన పెరిగిన
నగర పంచాయతీలు డివిజన్లు డివిజన్లు డివిజన్లు
/వార్డులు /వార్డుల /వార్డుల
కర్నూలు 52 68 16
ఆదోని 42 52 10
ఎమ్మిగనూరు 35 44 9
గూడూరు 20 23 3
కర్నూలు జిల్లా మొత్తం 149 187 38
నంద్యాల 42 52 10
డోన్ 32 36 4
నందికొట్కూరు 29 32 3
ఆత్మకూరు 28 32 4
ఆళ్లగడ్డ 27 32 5
నంద్యాల జిల్లా మొత్తం 158 184 26
ఉమ్మడి జిల్లా మొత్తం 307 371 64