పత్తి రైతులకు శుభవార్త
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:37 PM
పత్తి పంటను సాగుచేస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త ఇచ్చింది.
ధర లోటు చెల్లింపు పథకానికి శ్రీకారం
మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాల్లో..
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పత్తి పంటను సాగుచేస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త ఇచ్చింది. పత్తికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) నేరుగా రైతుల ఖాతా లో జమ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. కనీస మద్దతు ధరలకు ప్రత్యామ్నా యంగా ధర లోటు చెల్లింపు పథకం (ప్రైస్ డెప్షీట్ పేమెంట్ స్కీం) అమలుకు కేంద్రం కసరత్తు చేస్తోం ది. పైలెట్ ప్రాజెక్టుగా ఆదోని పత్తి మార్కెట్ ఎంపికకు కృషిచేస్తున్నారు. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు పడిపోతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వంటి ప్రభుత్వ సంస్థలు పత్తి పంటను ఎక్కువగా పండించే జిల్లాలో కేంద్రాలను ఏర్పాటుచేసి కొనుగోలు చేసేవారు. ఈ విధానంతో రైతుల నుంచి సేకరించే పత్తి నిల్వలను భద్రం పరిచే గిడ్డంగులు, రవాణా ఖర్చులు పెరగడంతో సీసీఐ అధికారులు మోయలేనిభారంగా అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్రం రైతుల నుంచే పత్తిని వ్యాపారులతో కొనుగోలు చేయించి ధర లోటు చెల్లింపు పథకాన్ని అ మలు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభు త్వం క్వింటా పత్తి కొనుగోలుకు రూ.8,111ను మద్దతు ధరగా ప్రకటించింది అనుకుంటే ఈ మద్దతు ధరకు సంబంధించి బహిరంగ మార్కెట్లో వ్యాపారులు రూ.7వేలు చెల్లిస్తే మిగిలిన రూ.1,111ను ప్రభుత్వమే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటిదాకా ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లికి మద్దతు ధరను అందించే విషయంలో అమలుచేసి సక్సెస్ అయింది. వచ్చే ఖరీఫ్ నుంచి పత్తి రైతులకు వర్తింపజేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది.
విధి విధానాలు అందలేదు
పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు సంబంధించి ప్రత్యామ్నాయంగా ధర లోటు చెల్లింపు పథకం అమలుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ పథకం అమలుకు సంబంధించి మార్కెటింగ్ శాఖకు కేంద్రం నుంచి ఎలాంటి విధి విధానాలు అంద లేదు.
నారాయణమూర్తి, ఏడీఎం, కర్నూలు