ఆది దంపతులకు స్వర్ణ రథోత్సవం
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:18 PM
లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు.
స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు
శ్రీశైలం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాల తరువాత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు జరిపించారు. అనంతరం గంగాధర మండపం వద్ద స్వర్ణరథంపై ఊరేగించారు. ఆలయ చైర్మెన్ పోతుగుంట రమే్షనాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్వర్ణరథం వద్ద వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు చేసిన సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు భక్తులను అలరించాయి. గ్రామోత్సవంలో ఈఈ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, ఎడిటర్ అనీల్ కుమార్, సీఎ్సవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
చైత్రమాస పౌర్ణమి తరువాత భ్రమరాంబదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఏప్రిల్ 7న అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలతో సాత్వికబలి కుంభోత్సవాన్ని జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో రాశులుగా పోసిన కొబ్బరికాయలకు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి రామచంద్రరావు దంపతులు పాల్గొని స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.