అప్పుల బాధతో నలుగురి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:19 AM
అప్పుల వారి బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలో మల్యాల గ్రామంలో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు.
ఒకరి పరిస్థితి విషమం
నందికొట్కూరు రూరల్, జూలై ౖ29 (ఆంధ్రజ్యోతి): అప్పుల వారి బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలో మల్యాల గ్రామంలో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డె రామసుబ్బడు నన్నూరు నుంచి ఏడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు. బొలెరో వాహనం బాడుగకు తిప్పుతూ జీవనం సాగించేవాడు. ఈ వాహనాన్ని మైక్రో ఫైనాన్స్లో తీసుకున్నాడు. రామసుబ్బడు వాహనానికి సంబంధించిన రెండు కంతులు కట్టలేదు. కంపెనీ సిబ్బంది కొన్నిరోజుల క్రితం వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లారు. ఉపాధి లేకపోవడంతో మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామంలో సైతం కొంతమంది వద్ద అప్పులు చేసినాడు. ఆ అప్పుల వారి వేధింపులు తాళలేక అతడితో పాటు భార్య మాధవి, ఇద్దరు కూతుళ్లు జయతేజ. అక్షయ పాములపాడు మండలం ఎర్రగూడూరు వద్ద గల ఎల్లమ్మ గుడి సమీపంలో బుధవారం గడ్డిమందును తాగారు. అనంతరం బంధువులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న వారు 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చిన్న కూతురు అక్షయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనతోనైనా వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్, కాల్మనీ ముఠాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.