‘జలధార’తో నీటి భద్రతపై దృష్టి
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:19 PM
జిల్లాలో జలధార కార్యక్రమం ద్వారా నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
భూగర్భజలాల పెంపుదలకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలధార కార్యక్రమం ద్వారా నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె తమ ఛాంబర్లో భూగర్భజలాల పెంపుదలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భజలాల స్థాయిని పెంపొందించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన, శాస్త్రీయ మ్యాపింగ్, వర్షపు నీటినిల్వ, కృతిమ రీఛార్జ్ చర్యలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర ప్రణాళికలను అమలు చేయడం అత్యవసరమన్నారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్గా కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. హైడ్రోజియోలాజికల్ మ్యాపింగ్ ద్వారా భూగర్భ జలాశయాల స్థితిని అంచనా వేసి, సర్వే నంబర్ల వారీగా నీటి వనరులు, వాగులు, వంకలను కచ్చితంగా గుర్తించాలన్నారు. పనుల పురోగతిని ప్రతిరోజూ, ప్రతి వారం ఫొటోలతో సహా నివేదించాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.