రీఓపెన్ అర్జీలపై దృష్టి సారించండి
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:27 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించి రీఓపెన్ అయిన అర్జీలపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించి రీఓపెన్ అయిన అర్జీలపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఈ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రీఓపెన్ అర్జీలకు సంబంధించి 5,513 రీఓపెన్ కాగా 5,444 నాణ్యతతో పరిష్కరించినట్లు తెలిపారు. మిగతా 69ని కూడా అర్జీదారుడితో మాట్లాడి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా మొత్తం 272 అర్జీలు, రెవెన్యూ క్లినిక్ ద్వారా 137 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజాసమస్యలను నాణ్యతతో పరిష్కరించి ప్రజా సంతృప్తి స్థాయిని మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 90శాతం మెరుగైన స్థానంలో పెన్షన్ పంపిణీ జరుగుతున్నప్పటికీ ప్రజాసంతృప్తి స్థాయి 87 శాతం తగ్గడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రక్తనిల్వలను పూర్తి స్థాయిలో ఉంచాలనే సంకల్పంతో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీని ఏర్పాటు చేశా మని, అందుకు సంబంధించి ఉద్యోగులందరూ సభ్యులుగా నమోదు కావాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నారు. చిన్న మట్టి వినాయకులను పూజించాలన్నారు. వినాయక చవితి 14వ తేదీన ఉన్నందున ఇప్పటికే జిల్లాస్థాయి సమన్వయ సమావేశం పూర్తయిందని డివిజన్, మండల, గ్రామ స్థాయిలో సమావేశం నిర్వహించాలన్నారు. స్వచ్ఛాంధ్ర అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాలోని అన్ని శాఖలు, సంస్థలు చురుగ్గా పాల్గొని, ఉత్తమ ప్రతిపాదనలను నిర్ధేశిత గడువులోగా సమర్పించాలని ఆదేశించారు. డీఆర్వో రామునాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, రెడ్క్రాస్ ఛైర్మన్ దస్తగిరి, జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.