Share News

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:33 AM

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ జి రాజకుమారి పిలుపునిచ్చారు.

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ జి రాజకుమారి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్‌ స్టేడియం ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమం అనంతరం జిల్లా పోలీస్‌ శాఖ ఆఽధ్వర్యంలో అమలు చేస్తున్న నశా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తున్న ఈగల్‌ టీమ్‌ సేవలను కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో సిగరెట్‌, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్ధాల వినియోగంతో పాటు మొబైల్‌ ఫోన్‌లకు అతిగా అలవాటు పడటం, అనవసరమైన వీడియోలు, సోషల్‌ మీడియా కంటెంట్‌ను అధికంగా వీక్షించడం వంటివి వ్యసనాలుగా మారుతున్నాయని తెలిపారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు ఈగల్‌ టీమ్‌ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. యువత నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కింద మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, తమ జీవితాల్లో ఎటువంటి మత్తు పదార్దాలకు తావివ్వబోమని, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ఈ దిశగా చైతన్య పరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్‌ఓ రాము నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:33 AM