గంజాయి ధ్వంసం
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:06 AM
కర్నూలు, నంద్యాల జిల్లాల ఎక్సైజ్ శాఖ పరిధిలో 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 114.196 కేజీల గంజాయిని అధికారుల ధ్వంసం చేశారు.
నంద్యాల క్రైం/గడివేముల, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాల ఎక్సైజ్ శాఖ పరిధిలో 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 114.196 కేజీల గంజాయిని అధికారుల ధ్వంసం చేశారు. గడివేముల మండలం బిలకలగూడూరు సమీపంలోని జేఎ్సడబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో ఈ ప్రక్రియను చేపట్టారు. వివిధ కేసుల్లో జప్తుచేసిన డ్రై గంజాయిని నిబంధనల ప్రకారం ధ్వంసం చేసేందుకు ముందుగా అవసరమైన ప్రక్రియను పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చైర్పర్సన్గా, కర్నూలు, అనంతపురం అసిస్టెంట్ కమిషనర్లు కమిటీ సభ్యులుగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయి ధ్వంసం పూర్తిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, విక్రయించడం, నిల్వ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నంద్యాల ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్కుమార్, ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.