డ్రోన్లతో నేరాల నియంత్రణ
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:15 PM
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ప్రజల భద్రతే లక్ష్యం
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డే, నైట్ విజన్ డ్రోన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీ్సస్టేషన్ల పరిధిలోని కాలేజీలు, స్కూల్స్ వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి ఆకతాయిలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణకు భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ సాంకేతిక మరింత దోహదపడుతుందన్నార. ప్రజల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ పోలిసింగ్ దిశగా జిల్లా పోలీసు శాఖ ముందడుగు వేస్తోందన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్రావు, సైబర్ ల్యాబ్ సీఐ మస్తాన్వలి, ఆర్ఐ నారాయణ, సైబర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.