వసూల్ రాజాలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:22 AM
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ అవినీతిలో కూరుకుపోయింది. తహసీల్దార్ కార్యాలయాలు సెటిల్మెంట్స్కు అడ్డాగా మారాయి. రైతులు, ప్రజలు పైసలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది తహసీల్దార్లు ప్రైవేటు ఏజెంట్లను బినామీలుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతు భూమిని మ్యుటేషన్ చేయడానికి రూ.10వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారిని ఆర్డీవో, డీఆర్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు. పైసలు ఇచ్చే వారి అర్జీలను మాత్రమే పరిష్కారం చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ పాలన అటకెక్కింది.
పైసలిస్తేనే సమస్యలు పరిష్కారం
అక్రమార్జనకు పాల్పడుతున్న తహసీల్దార్లు
చక్రం తిప్పుతున్న బినామీలు
డ్రైవర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం
ఏసీబీకి పట్టుబడిన వ్యక్తికి కీలక పోస్టు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండల తహసీల్దార్ కార్యాల యాలు అవినీతికి అడ్డాలుగా మారాయి. ధనార్జన ధ్యేయంగా తహసీల్దార్లు పని చేస్తున్నా రన్న ఆరోపణలున్నాయి. మిగులు భూమిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు సెంటుకు రూ.10వేలు వసూలు చేస్తున్నారు. తహసీల్దార్ల కార్యాలయాల్లో పట్టాల మార్పిడి జోరుగా సాగుతున్నాయి. ఆఫ్లైన్ విధానం కావడంతో పాత తేదీలు వేసి రికార్డు రూమ్లో చక్కబె డుతున్నారు. ఒక పట్టా మార్పిడి రూ.30వేల నుంచి లక్షన్నర దాకా వసూలు చేస్తున్నారు. పట్టాల మార్పిడిలో మండల తహసీల్దార్ల కుంభకోణం తారాస్థాయికి చేరింది. కొందరు రెవెన్యూ ఉద్యోగులు పాత అధికారుల ప్రస్తుత అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేస్తున్నారు.
రెవెన్యూ క్లినిక్స్, స్పెషల్ క్యాంపుల..
ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్, స్పెషల్ క్యాంపుల, పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలను స్వీకరిస్తోంది. రైతుల అర్జీలను ఆసరాగా చేసుకుని జిల్లాలోని కొంతమంది తహసీల్దార్లు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కార్యాలయంలో పని చేసే డ్రైవర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, లేదా ఏదో ఒక ఉద్యోగిని బినామీలుగా నియమించుకొని వసూళ్ల పర్వానికి తెరలేపారు. ప్రతి భూ సమస్యను సెటిల్మెంట్ ద్వా రానే పరిష్కరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల మండల కార్యాలయంలో ప్రభు త్వ భూమిని ఆన్లైన్లో ఎక్కించేందుకు ఒక వీఆర్వో పైసా వసూలు చేశారు. మరో మం డలంలో భూమి లేని ప్రాంతంలో వీఆర్వో పట్టాలు మంజూరు చేసి ఒక్కొక్క పట్టాకు రూ.లక్ష వసూలు చేశారు. ఆ తహసీల్దార్, వీఆర్వోలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
డీటీ చెప్పిందే వేదం
డీఆర్వో కార్యాలయంలో ఒక డిప్యూటీ తహసీల్దార్(డీటీ) చెప్పిందే వేదం. ఆయన మాఏ శాసనం అన్నరీతిలో ఫైళ్లు కదులున్నాయి. గతంలో ఆ డీటీ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆయ నపై విచారణ నేటికీ కొనసాగుతోంది. ఆవిచారణపై ఉన్నతాధికారులను పక్కదావ పట్టిం చడానికి డీఆర్వో కార్యాలయంలో తిష్ఠ వేశాడు. ఆయనకు రెవెన్యూ శాఖ అధికారులు కీలక పోస్టు అప్పజెప్పడం కొసమెరుపు. ఆయనకు ఈఏడాది జనవరి 26న ఉత్తమ ప్రశం సాపత్రం కూడా అందజేశారు. ఆయనను ఉన్నత సీటులో కూర్చొబెట్టడం దొంగకు తాళం ఇచ్చినట్లు అన్న చందం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్న ఉద్యోగం.. పెద్ద సెటిల్మెంట్లు
జిల్లాలోని ఒక ఆర్డీవో కార్యాలయంలో నెలకు రూ.10వేల జీతం మాత్రమే పొందుతున్న ఓ చిరుద్యోగి చక్రం తిప్పుతున్నాడు. భూ యజమానులతో ముందస్తు చర్చలు జరిపి, వారికి అనుకూలంగా రిపోర్టులు పంపించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తి కూడా కీలకపాత్ర పోషిస్తున్నారన్న సమాచారం.
విచారణ చేపడుతాం
ప్రభుత్వ భూమి ఆన్లైన్లో నమోదుకు ప్రయత్నించిన వీఆర్వో, భూమిలేని ప్రాంతంలో పట్టాలు మంజూరుచేసి వసూలు చేసిన వీఆర్వో, అక్రమాలకు పాల్పడుతున్న తహసీల్దార్లపై విచారణ చేపడుతాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. - నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు