మొక్కజొన్న ధర పతనం
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:19 AM
మొక్కజొన్న ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండంలోని జలదుర్గం, మాధవరం, రామక్రిష్ణాపురం, ఊటకొండ, గోపాల్ నగరం తదితర గ్రామాల్లో దాదాపు 300 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
క్వింటం రూ.1500
లబోదిబోమంటున్న రైతులు
ప్యాపిలి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండంలోని జలదుర్గం, మాధవరం, రామక్రిష్ణాపురం, ఊటకొండ, గోపాల్ నగరం తదితర గ్రామాల్లో దాదాపు 300 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ.30వేలు ఖర్చుచేశామని రైతులు అంటున్నారు.
ధరలేక ఆవేదన..
ప్రస్తుతం మొక్కజొన్న క్వింటం ధర రూ.1500 మించి పలకడం లేదు. కనీసం రూ.2వేలకు పైగా పలికితేనే తాము గట్టెక్కుతామని, ధర పడిపోవడంతో ఏమి చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తాయన్నారు. పది రోజుల క్రితం క్వింటం రూ.2400 పలుకగా, తీరా దిగుబడి వచ్చేనాటిని రూ.1500లకు పడిపోవటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
రవాణా ఖర్చులు కూడా రావు..
పంట దిగుబడులను విక్రయించాలంటే కర్నూలు మార్కెట్కు తరలించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ధరకు రవాణా ఖర్చులు కూడ చేతికి వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.