నెలాఖరుకు మ్యాపింగ్ పూర్తి చేయండి
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:13 PM
నెలాఖరుకు మ్యాపింగ్ పూర్తి చేయండి
కలెక్టర్ డా.ఏ.సిరి
ఆదోని, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మార్చి చివరి నాటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. బుధవారం ఆదోని సబ్కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో నిర్వహిస్తున్న మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ సిరి మాట్లాడుతూ ఎలెక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైందన్నారు. తహసీల్దార్లు, బీఎల్వోలు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలక్టోరల్ మ్యాపింగ్లో పురోగతి తీసుకుని రావాలన్నారు. ప్రతి బూత్ స్థాయిలో కచ్చితమైన డేటా నమోదు జరగాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమ గ్రంగా మ్యాపింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆదోని ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్, తహసీల్దార్ శేషఫణి, డీఎల్పీవో తిమ్మక్క, మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ పాల్గొన్నారు.
రుచికరమైన భోజనం అందించాలి
అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఆదోనిలోని ప్రసూతి ఆస్పత్రి సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, సరఫరా విధా నం సేవలను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు. ఆదోని సబ్కలెక్టర్ (ఇన్చార్జి) అజయ్కుమార్, ఆదోని తహసీల్దార్ శేషఫణి పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని కలెక్టర్ సిరి హెచ్చరించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. పారిశుధ్యం, రికార్డులను, బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. విధులకు గైర్హాజరైన, ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విధుల్లో అలసత్వం వహించినా, రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిం చినా ఉపేక్షించేది లేదన్నారు.