కారుణ్య నియామకాలను పూర్తి చేయండి
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:49 PM
పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అన్ని కారుణ్య నియామకాల కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి వాటిని 15 రోజుల్లోగా పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి శాఖ కీలకపాత్ర పోషించాలని సూచించారు.