‘సర్’ను వందశాతం పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:02 AM
ప్రత్యేక సమగ్ర సవరణను వందశాతం పూర్తి చేయాలని బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్రెడ్డి ఆదేశించారు. ఆదివారం రామాపురం గ్రామం సచివాలయలో బీఎల్వోల పనితీరును తనిఖీ చేశారు.
ఆర్డీవో నరేంద్రనాథ్రెడ్డి
అవుకు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర సవరణను వందశాతం పూర్తి చేయాలని బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్రెడ్డి ఆదేశించారు. ఆదివారం రామాపురం గ్రామం సచివాలయలో బీఎల్వోల పనితీరును తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో విశ్వనీయతను పెంచాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం సర్ను నిర్వహిస్తోందని, 14వ తేదీతో గడువు ముగియనుందన్నారు. బీఎల్వోలు నిర్లక్ష్యం వీడి ఫారాల సేకరణ వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల నుంచి వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని ఓటర్లకు సూచించారు. పీడీవో శ్రీనివాసులు, బీఎల్వోలు పాల్గొన్నారు.
87 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి
కొలిమిగుండ్ల: ఈ నెల 14లోపు ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్డీవో నరేంద్రనాధ్ రెడ్డి సూచించారు. ఆదివారం అంకిరెడ్డిపల్లె, కనకాద్రిపల్లె, ఇటిక్యాల, కొలిమిగుండ్ల గ్రామాల్లో పరిశీలించారు. బీఎల్వోలతో మాట్లాడుతూ నిర్ణీత సమయంలోపు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనని, రెవెన్యూ డివిజన్ పరిధిలో 94శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేశామని, 87శాతం డిజిటలైజేషన్ కూడా పూర్తయిందన్నారు. తహసీల్దార్ షఫీ, విఆర్ఓలు ప్రసాద్ రెడ్డి, భార్గవి పాల్గొన్నారు.
‘సర్’ విధుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఉయ్యాలవాడ: సర్ సర్వేలో నిర్లక్ష్యం వీడి పనిచేయాలని తహసీల్దారు ప్రసాద్బాబు సూచించారు. ఆదివారం మాయలూరు, తుడుమలదిన్నె, పెద్దయమ్మనూరు, సర్వాయిపల్లె గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. మండలంలో 92.10 శాతం పూర్తయిందని, 23,184 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకూ 20,309 ఓటర్లను డిజిటలైజేషన్ చేశామన్నారు. 14 నాటికి వంద శాతం పూర్తి చేస్తామన్నారు. అలాగే 1,044 ఓటర్ల డబుల్ ఎంట్రీలు, శాశ్వతంగా ఊరి విడిచి వెళ్లిన వారు, మరణించిన వారు ఉన్నాన్నారు. వీఆర్వోలు వెంకటలక్ష్మీ, దాదా సాహేబ్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.