27న జొన్నగిరికి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:45 PM
జొన్నగిరిలోని బంగారు శుద్ధి కర్మాగారం జియో మైసూరు గోల్డ్ కంపెనీని పరిశీలనకు ఈనెల 27న సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్నారు.
జియో మైసూరు కంపెనీ సందర్శన
గనుల శాఖ చీఫ్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా
తుగ్గలి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జొన్నగిరిలోని బంగారు శుద్ధి కర్మాగారం జియో మైసూరు గోల్డ్ కంపెనీని పరిశీలనకు ఈనెల 27న సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లపై గనుల శాఖ చీఫ్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అధికారులతో చర్చించారు. జియో మైసూరు గోల్డ్ కంపెనీని ఆయన తనిఖీ చేశారు. బంగారు వెలికితీసే యంత్రాలను పరిశీలించి కంపెనీ పురోగతిపై ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ కంపెనీ కొనుగోలు చేసిన భూముల వివరాలు ఆ కంపెనీ మ్యాప్లను కూడా పరిశీలించారు. ఈనెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జియో మైసూరు కంపెనీనీ సందర్శిస్తారని ఆయన వెల్లడించారు. ఆరోజుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఈ ప్రాంతంలోనే బహిరంగ సభ కూడా ఉంటుందని తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కరువు ప్రాంతంలో బంగారు నిక్షేపాల కంపెనీ ఏర్పాటు కావడం ప్రజలకు వరమని అన్నారు. ఈయన వెంట పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐలు పులిశేఖర్, స్వర్ణలత, తహసీల్దార్ రవి, వీఆర్వోలు కాశీరంగస్వామి, రాజేశ్వరి, సర్వేయర్ సుధాకర్, ఎస్ఐ మల్లికార్జున, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.