ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:32 AM
పాలనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలని, ఆ దిశగా ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు
సీఎం చంద్రబాబు నాయుడు
రాత్రి అధికారులతో సమీక్ష
కర్నూలు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పాలనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలని, ఆ దిశగా ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమీక్షలో పలు కీలక అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసి పనితీరు సరిగ్గా లేకపోతే ప్రజల్లోనే నివేదికలు ఉంచుతామన్నారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించాలని సీఎం ఆదేశించారు. పత్తికొండ నియోజకవర్గంలో ఉద్యాన సాగు చాలా తక్కువగా ఉందని, డ్రిప్ ఇరిగేషన్తో పాటు హార్టికల్చర్ సాగును పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన వంగడాలతో ఉల్లి సాగు చేసేలా రైతులను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజలకు ఆదాయం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. జలధార-జలహారతిలో భాగంగా 246 చెరువులకు సంబంధించి పనులను ఈ సీజన్లోనే పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, పార్థసారథి, ఎంపీ నాగరాజు, కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరుల్ ఖమర్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.