అక్కపై తమ్ముళ్ల హత్యాయత్నం!
ABN , Publish Date - May 19 , 2026 | 12:33 AM
వివాహేతర సంబంధం పెట్టుకొని తమ పరువును తీసిందని తమ్ముళ్లు తమ అక్కను హత్య చేసేందుకు యత్నించిన సంఘటన పెద్దకడబూరు మండలం ముచ్చుగిరిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
వివాహేతర సంబంఽధ వీడియోలు వెలుగులోకి
ఆగ్రహించిన సోదరులు
మహిళ పరిస్థితి విషమం
పెద్దకడబూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం పెట్టుకొని తమ పరువును తీసిందని తమ్ముళ్లు తమ అక్కను హత్య చేసేందుకు యత్నించిన సంఘటన పెద్దకడబూరు మండలం ముచ్చుగిరిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఓ మహిళకు 20 సంవత్సరాల క్రితం ఆదోని మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు బిడ్డలు జన్మించిన అనంతరం భార్యభర్తలు విడిపోయారు. ఓ కుమార్తె తండ్రితో, మరో కుమార్తె తల్లితో ఉండిపోయారు. అప్పటి నుంచి సదరు మహిళ పుట్టినిల్లు అయిన ముచ్చుగిరిలోనే ఉంటూ రోజు వారి కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆ మహిళకు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆ మహిళతో ఏకాంతంగా గడిపిన వీడియోలను చిత్రికరించాడు. ఆ రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి.
వీడియోలను చూసిన మహిళ తమ్ముళ్లు ఇద్దరు ఆగ్రహంతో ఊగిపోయారు. తమ పరువు తీసిన అక్కను హతమార్చాలని ప్లాన్ చేశారు. సోమవారం రాత్రి కొడవలితో సోదరిని విచక్షణ రహితంగా నరికారు. చనిపోయిందని భావించి ఆమెను ఫీల్డ్ అసిస్టెంట్ స్నేహితుడి ఇంటి వద్ద పడేపోయారు. అయితే అ మహిళ కొన ఊపరితో ఉందని స్ధానికుల సమాచారంతో తెలుసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్ధితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు పోలీసులు ఆమెను కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకడబూరు హెడ్ కానిస్టేబుల్ రామయ్య వెల్లడించారు. హత్యకు యత్నించిన నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.