పోలీసు శాఖలో లంచావతారుడు
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:54 PM
పోలీసు శాఖలో ఓ లంచావతారుడు ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.15వేలు లంచం తీసుకుంటూ మంగళవారం అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు..
స్టేషన్ బెయిల్ మంజూరు కోసం రూ.35వేలు డిమాండ్
రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు
ఆళ్లగడ్డ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో ఓ లంచావతారుడు ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.15వేలు లంచం తీసుకుంటూ మంగళవారం అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు.. వివరాలు.. ఆళ్లగడ్డ టౌన్ పోలీస్స్టేషన్లో కోటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం పట్టణానికి చెందిన రఘునాథ్ ఆచారి అన్నదమ్ములు ఓ ముస్లిం వక్తిపై గొడవ పడి రాళ్లతో దాడి చేశారు. ఈఘర్షణకు సంబంధించి రఘునాథ్ ఆచారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈకేసులో స్టేషన్ బెయిల్ మంజూరు కోసం హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు బాధితుడికి రూ.35వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు మొదట రూ.20వేలు లంచం ఇచ్చాడు. మిగిలిన రూ.15వేల కోసం హెడ్ కానిస్టేబుల్ ఒత్తిడిచేశాడు. విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న కెమికల్స్ పూసిన డబ్బును బాధితుడికి ఇచ్చి పంపారు. పట్టణం లోని గోదాము సమీపంలో కోటేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఏసీబీ దాడులతో బెంబేలు
ఆళ్లగడ్డ పట్టణంలో వరుస ఏసీబీ దాడులతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఏడాది వ్యవధిలోనే మూడు సార్లు ఏసీబీ అధికారులు దాడులు చేసి ముగ్గురు అధికారులను రెడ్ హ్యం డ్గా పట్టుకున్నారు. గత ఏడాది విద్యుత్శాఖలో పని చేస్తున్న ఏడీఏ రవికాంత్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి 1.5 కేజీల బంగారం, రూ 3కోట్ల నగదు, ఇతర దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్అండ్బీ శాఖ కార్యాల యంలో ఏఈగా పనిచేస్తున్న దస్తగిరి తమ పరిధితో పనులు చేసుకోవాలంటే రూ.40 వేలు లంచం ఇవ్వాలని ఓ ప్రైవేటు ఫైబర్ కంపెనీ అధికారులకు డిమాండ్ చేశారు. వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా దస్తగిరిని దాడి చేసి పట్టుకు న్నారు. మంగళవారం ఏసీబీ అధికారుల దాడులు సంచలనంగా మారాయి. పలు శాఖల్లోని అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.