క్షయపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:09 AM
క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు డీఎంహెచ్వో డా.ఎల్. భాస్కర్ తెలిపారు.
కర్నూలు హాస్పిటల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు డీఎంహెచ్వో డా.ఎల్. భాస్కర్ తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అవగాహన ర్యాలీని డీఎంహెచ్వో జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో క్షయ వ్యాధిని పారదోలేందుకు 98 గ్రామాలను హైరిస్క్ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి 100 రోజుల పాటు మొబైల్ ఎక్స్రే పరికరంతో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం రావడం, బరువు తగ్గడం, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం ర్యాలీ కలెక్టరేట్ నుంచి కర్నూలు మెడికల్ కాలేజీ మీదుగా న్యూలెక్చరర్ గ్యాలరీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ డా. మహేశ్వర ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి ఏ. నూకరాజు, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డా.జి. మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.