కర్నూలు నుంచి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:12 AM
కర్నూలు నుంచి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ కోరారు.
కర్నూలు అర్బన్, జూలై 17(ఆంధ్రజ్యోతి): కర్నూలు నుంచి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్వీని శ్రీవైష్ణవ్ను కలిసి ఓ వినతి పత్రం ద్వారా కోరారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నుండి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండుసార్లు, అదేవిధంగా కర్నూలు నుంచి విజయవాడకు ప్రతి రోజూ రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.
అభివృద్ధికి రైల్వే అనుసంధానం ముఖ్యం
ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. శుక్రవారం డిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీవైష్టవ్ను కలిసి రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. నేషనల్ ఇండస్ట్రియల్ నోడ్స్ హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్లు నోడ్, చెన్నె- బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్లు నోడ్, చెన్నె-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ల అభివద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఓర్వకల్లు- కృష్ణపట్నం నోడ్లను అధునిక మౌలిక సదుపాయాలతో పాటు ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులతో స్థిరమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఓర్వకల్లు, కృష్టపట్నం, నోడ్లకు ప్రతిపాదిత రైల్వే సైడింగ్/ లైన్ల అభివృద్ధిని చేపట్టడానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాధనలను రైల్వే శాఖ మంత్రి వీలైనంత త్వరగా అమెదించేలా చూడాలని ఆయన కోరారు.