Share News

అంగన్‌వాడీలకు కనీస వేతనమివ్వాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:26 PM

అంగన్‌ వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీలకు కనీస వేతనమివ్వాలి
ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీలు

అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌

యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల

నంద్యాల నూనెపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌ వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంగన్‌వాడీల కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మార్కెట్‌ యార్డు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే అంగన్‌ వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు మాట్లాడుతూ పని భారం పెంచే నవచేతన యాప్‌ రద్దు చేయాలన్నారు. అనంతరం తమ డిమాండ్లను పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

సీఐతో వాగ్వాదం

కలెక్టర్‌ బయటకు వెళ్తున్న సమయంలో మెయిన్‌గేట్‌ వద్ద ఆందోళనకారులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయ త్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టర్‌ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసిన అంగన్‌వాడీలను పోలీసులు వారించారు. దీంతో అంగన్‌వాడీలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ డౌన్‌ డౌన్‌ అంటూ అంగన్‌వాడీలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది.

Updated Date - Jul 10 , 2026 | 11:26 PM