అంబటీ.. నోరు జాగ్రత్త
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:59 PM
అంబటి.. నోరు జాగ్రత్త పెట్టుకోవాలని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టి టీడీపీ శ్రేణులు
దిష్టిబొమ్మ దహనం.. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు
కర్నూలు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): అంబటి.. నోరు జాగ్రత్త పెట్టుకోవాలని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోసిగి మండలం దుద్ది గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి.. అంబటి రాంబాబు ఫొటోలను అగ్గి మంటల్లో వేసి దహనం చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అంబటి శవయాత్ర నిర్వహించారు. కోడుమూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నాయకత్వంలో, ఆలూరులో టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం ప్రసాద్ ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో, టీడీపీ నాయకుడు కె.ఉమాపతినాయుడు ఆదోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఇస్వీ పోలీస్ స్టేషన్లో, పత్తికొండలో టీడీపీ రాష్ట్ర నాయకులు సీఐ జయన్నకు ఫిర్యాదు చేశారు.
కర్నూలులో ఎమ్మెల్యే గౌరు చరిత ఫిర్యాదు
ప్రగతి ప్రదాత సీఎం చంద్రబాబుపై అసభ్యకర పదజాలంతో దూసించిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షు రాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత డిమాండ్ చేశారు. అంబటి ఖబడ్దార్ అంటూ ఘాటుగా హెచ్చరించారు. కల్లూరు అర్బన్ పరిధిలో 36వ వార్డు వై జంక్షన్లో టీడీపీ నాయకుడు గౌరు జనార్దన్రెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ కె.పార్వతమ్మ, కర్నూలు డీసీఎంఎస్ చైర్మెన్ వై.నాగేశ్వరరావు యాదవ్, తెలుగు టీడీపీ శ్రేణులతో కలిసి అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.