విక్రయాల్లో అక్రమాలు జరిగితే చర్యలు
ABN , Publish Date - May 16 , 2026 | 11:41 PM
ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం పాతబస్టాండులోని సూర్య ట్రేడర్స్, బంగారుపేటలో ఉన్న శ్రీశివరామకృష్ణ ఎరువుల దుకాణాన్ని జేసీ నూరుల్ ఖమర్తో కలిసి కలెక్టర్ అకస్మిక తనిఖీలు చేశారు.
కలెక్టర్ ఏ.సిరి
కర్నూలు అగ్రికల్చర్, మే 16 (ఆంధ్రజ్యోతి): ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం పాతబస్టాండులోని సూర్య ట్రేడర్స్, బంగారుపేటలో ఉన్న శ్రీశివరామకృష్ణ ఎరువుల దుకాణాన్ని జేసీ నూరుల్ ఖమర్తో కలిసి కలెక్టర్ అకస్మిక తనిఖీలు చేశారు. శివరామకృష్ణ ఎరువుల దుకాణంలో రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆ డీలర్ లైసెన్సును సస్పెన్షన్ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుకు ఎరువులు విక్రయించిన వెంటనే బిల్లు ఇవ్వాలని, అనంతరం అదే వివరాలను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేసి మిగిలిన నిల్వలను స్పష్టంగా చూపాలని కలెక్టర్ డీలర్ను ఆదేశించారు. రైతులకు యూరియాను విక్రయించాక కచ్చితంగా వారి ఫోన్ నెంబర్లను నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన డీలర్లపై ఇప్పటి వరకు జిల్లాలో 15 లైసెన్సులను సస్పెన్షన్ చేశామని తెలిపారు. జిల్లాలో యూరియా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. మూడు సంవత్సరాల్లో ఒకటి, లేదా ఒకటిన్నర టన్నుల యూరియా విక్రయాలు జరిగిన చోట చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామని, ఆ దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నివేదికలు అందజేయాలని జేడీని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జేడీ వరలక్ష్మి, ఏడీఏ శాలురెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి రూపస్ పాల్గొన్నారు.