డిజిటలైజేషన్ను వేగవంతం చేయండి: కలెక్టర్
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:00 AM
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్’) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు.
కోడుమూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్’) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం ఆమె కోడుమూరులో పర్యటించి సర్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి బీఎల్వోలు వస్తున్నారా? లేదా? ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి ఎన్ని రోజులైందంటూ ఆరా తీశారు. ‘ఏవో పేపర్ ఇచ్చి వెళ్లారు. ఇంతవరకూ ఎవరూ రాలేదు. ఆ ఫారం ఎలా భర్తీ చేయాలో మాకు తెలియదు..’ అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. దీంతో ఎన్యుమరేషన్ ఫారం ఎలా భర్తీ చేయాలో కలెక్టర్ నేరుగా ప్రజలకు వివరించారు. అనంతరం బీఎల్వోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫారాల భర్తీని కూడా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. డిజిటలైజేషన్ ప్రక్రియపై తహసీల్దార్ నాగరాజును అడిగారు. కలెక్టర్ వెంట ఆర్ఐ అశోక్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ విష్ణుమాధవ్, ఈశ్వర్, వీఆర్వోలు పరమేష్, ఎల్లప్ప ఉన్నారు.
కలెక్టర్ దృష్టికి తాగునీటి సమస్య
కొళాయిల్లో కలుషిత నీరు వస్తోందని కలెక్టర్ సిరి దృష్టికి పలువురు మహిళలు తీసుకొచ్చారు. పది రోజులకు ఓసారి నీటిని సరఫరా చేయ డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏకరువు పెట్టారు. తాగు నీటి సమస్య పరిష్కారం కోసం ఒక బృందాన్ని పంపిస్తానని కలెక్టర్ మహిళలకు హామీనిచ్చారు.