బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:00 AM
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నగరంలోని బీసీ భవన్లో ఆదివారం బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు, మంత్రి నారా లోకేశ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ప్రపంచంలో ఆదర్శంగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ వర్గానికి చెందిన వారు కావడం వల్ల బీసీల సమస్యలు వారికి బాగా తెలుసునని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగ, విద్య రాజకీయాల్లో రిజర్వేషన్లు భాగం కల్పించి బీసీలకు ప్రధాన మైన డిమాండ్లను నెరవేర్చడానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. కర్నూలులో బీసీ భవన్ నిర్మాణానికి పరిశ్రమల మంత్రి టీజీ భరత్ రూ.2 కోట్లు ఇదివరకే ప్రకటించారని, అలాగే తాను కూడా రాజ్యసభ నిధుల నుంచి రూ.కోటి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేసీ నాగన్న, మాజీ అధ్యక్షులు సుగూరు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపెంట రాంబాబు, వాల్మీకి కార్పొరేషన్ల డైరెక్టర్లు రామకృష్ణ, మురళి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శకుంతల, భారతి, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.