జేఈఈలో విజేతలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:00 AM
కలలు కన్నారు.. కష్టించారు.. ఫలితం పొందారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్లో ఉమ్మడి కృష్ణాజిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలోని చైతన్య, నారాయణ, వశిష్ట, శారద విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ప్రతిభ చూపారు. నూరుశాతం పర్సంటైల్ మార్కులను విజయవాడ చైతన్య కాలేజీ (గాయత్రి క్యాంపస్) విద్యార్థి పసల మోహిత సాధించాడు. ఇదే క్యాంపస్ నుంచి కాటా హిమకర్ 99.99, గన్ని సాయి సాత్విక్ 99.99, ముక్కర సాకేత 99.99 పర్సంటైల్ మార్కులు పొందారు. తమ విద్యాసంస్థల్లో చదివిన చల్లా సాయి వెంకట ఆదిత్య (99.80 శాతం), కట్టా హితేష్ (99.77 శాతం), సీబీ జయంత (99.69 శాతం), ధ్రువంతేజ్ (99.14 శాతం), రిషి కీర్తన్రెడ్డి (99.12 శాతం) మంచి మార్కులు సాధించారని శ్రీవశిష్ట విద్యాసంస్థల చైర్పర్సన్ లింగమనేని ప్రమీలరాణి తెలిపారు. - ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ
మెయిన్స్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
రోజుకు 15 గంటలు కష్టపడ్డాను..
ఐఐటీ మెయిన్సలో ఉత్తమంగా నిలవాలని రోజుకు 15 గంటలు చదివాను. కానూరులోని శ్రీ వశిష్ట విద్యాసంస్థలో ఇంటర్తో పాటు ఐఐటీ మెయిన్సకు కోచింగ్ తీసుకున్నాను. మంచి పర్సంటేజీ సాధించడం ఆనందంగా ఉంది. నా తండ్రి శివ విజయవాడలోని పండ్ల మార్కెట్లో రోజు వారీ కార్మికుడు. అమ్మ నాగమణి గృహిణి. బాంబేలోని ఐఐటీలో చేరాలనే ఆలోచనతో ఉన్నాను.
- చల్లా సాయివెంకట ఆదిత్య, విజయవాడ
ఐఐటీలో సీటు లక్ష్యంగా..
ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో చదివాను. చాలా కష్టపడ్డాను. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంది. అనున్నది సాధించాను. ప్రస్తుతానికి ఎక్కడ చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. అమ్మానాన్న చాలా సంతోషంగా ఉన్నారు. - ఎం.మురళీధర్రెడ్డి, నందిగామ
ప్రతి సబ్జెక్టు రోజుకు 4 గంటలు చదివాను
బాంబే ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. దీనికోసం ఎంతో కష్టపడి చదివాను. ఒక్కో సబ్జెక్టుకు రోజుకు 4 గంటల కేటాయించాను. లక్ష్యాన్ని సాధించాలనే తపనతో మాక్ టెక్ట్స్లకు క్రమంగా తప్పకుండా హాజరయ్యేవాడిని. రోజు మార్చి రోజు నిర్వహించిన మాక్ టెక్ట్స్లలో నా తప్పులను సరిదిద్దుకున్నాను. నా కష్టం ఫలించింది.
- పసల మోహిత, జమ్మలమడుగు
సంతోషంగా ఉంది
శ్రీ చైతన్య, ఎనసీఈఆర్టీ, జీటీఎం మెటీరియల్తో ప్రిపేర్ అయ్యాను. సీటు సాధించాలనే ఆలోచనను లక్ష్యంగా చేసుకున్నారు. తప్పులను సరిదిద్దుకున్నాను. బాంబే ఐఐటీలో సీఎస్ఈ సీటు సాధించేందుకు కష్టపడ్డాను. నా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు వెంకటరత్నం, సతీష్గోపాల్, టీచర్లు అందించిన సహకారం మరువలేనిది.
- కటా హిమకర్, విజయనగరం
రోజుకు 12 గంటలు పైగా చదివాను
ముంబయి ఐఐటీలో సీటు సాధించడమే నా లక్ష్యం. దీనికోసం ఎంతో కష్టపడ్డాను. రోజూ 12 గంటలు చదువుకే కేటాయించాను. మా కాలేజీ యాజమాన్యం రోజు మార్చి రోజు నిర్వహించిన మాక్ టెక్ట్స్లు ఎంతో ఉపయోగపడ్డాయి. అన్ని సబ్జెక్టుల్లో మా తప్పులను సరిదిద్దుకునేందుకు అవి ఎంతో సహకరించాయి. నాన్న శ్రీనివాసరావు, అమ్మ భారతి వ్యవసాయ పనులు చేస్తుంటారు. నాకు మంచి ర్యాంక్ రావడంతో వారు ఎంతో సంతోషపడ్డారు. - గన్ని సాయిసాత్విక్, రామచంద్రపురం
చదువుకే అధిక సమయం
టీచర్లు ఇచ్చిన అసైనమెంట్లు తప్పకుండా పూర్తిచేసేవాడ్ని. ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచుకున్నాను. ముందే నిర్దేశించుకున్న సమయాన్ని చదవడానికి కేటాయించాను. రోజూ అధిక సమయం చదువుకే కేటాయించాను. శ్రీచైతన్య, ఎనసీఈఆర్టీ, జీటీఎం మెటీరియల్ ఎంతో ఉపయగపడ్డాయి. టీచర్లు ఇచ్చే నోట్స్ నిత్యం ప్రిపేర్ అయ్యేవాడ్ని. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాన్న వెంకటసుబ్బారెడ్డి ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.
- ముక్కర సాకేత, కడప
ఆనందంగా ఉంది
టార్గెట్ రీచ అయినందుకు సంతోషంగా ఉంది. దీనికోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది. చదువుకు ఎక్కువ సమయం కేటాయించాను. అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాను. నా తప్పులను సరిదిద్దుకునేందుకు కాలేజీ మేనేజ్మెంట్ నిర్వహించిన మాక్ టెక్ట్స్లు ఎంతో ఉపయోగపడ్డాయి. మంచి మెటీరియల్ను మాకు అందించారు. నా తండ్రి వెంకటశివరావు గుంటూరు బ్రాడిపేటలో జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. - పగడాల పార్వతి చెన్నకేశవ్, గుంటూరు
సివిల్స్ సాధిస్తాను..
ఐఏఎస్ కావాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడైతే ఇంజనీరింగ్ పూర్తిచేస్తాను. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. ఎంత కష్టపడి అయినా సివిల్స్ సాధించి తీరుతాను. దీనికోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాను. అనున్నకున్నది సాధిస్తాననే నమ్మకం ఉంది.
- సాలి రోజ్మేరీ, జి.కొండూరు
అబ్ధుల్ కలాం స్ఫూర్తితో..
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం నాకు స్పూర్తి. ఆయన మాదిరిగానే మిస్సైల్ మ్యాన కావాలన్నదే నా ధ్యేయం. అందుకే ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. దానికోసమే కష్టపడ్డాను. ఎప్పటికైనా నా కలను సాధించుకుంటాను. - పర్జూరు శ్రీచరణ్, జి.కొండూరు