స్థానిక ఎన్నికలకు జనసేన సమాయత్తం.. కందుల దుర్గేష్కు కీలక బాధ్యతలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 09:19 PM
ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమవుతోంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార వ్యూహంపై చర్చించారు.
అమరావతి, సెప్టెంబర్ 20: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమవుతోంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార వ్యూహంపై చర్చించారు. ఎన్నికలకు ముందే పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సమన్వయం చేయడంతో పాటు.. గ్రామాలు, వార్డుల స్థాయి వరకు ప్రచార కార్యక్రమాలను విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా జనసేన తన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసింది. జనసేన ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్కు బాధ్యతలు అప్పగించారు. ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును కమిటీ సభ్యుడిగా నియమించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు జనసేన నాయకత్వం చర్యలు చేపడుతోంది.