Share News

రూ.323 కోట్లతో ఉప్పాడ తీరానికి రక్షణ గోడ

ABN , Publish Date - Aug 13 , 2026 | 07:38 AM

సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంతంలో రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ- మద్రాస్‌తో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మధ్య ఒప్పందం చేసుకుంది.

రూ.323 కోట్లతో ఉప్పాడ తీరానికి రక్షణ గోడ

  • ఐఐటీ- మద్రాస్‌తో ఏపీఎస్‌డీఎంఏ ఒప్పందం

  • ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఎంవోయూ

అమరావతి: సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంతంలో రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ- మద్రాస్‌తో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మధ్య ఒప్పందం చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీరప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌, సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ-మద్రాస్‌కు అప్పగిస్తూ బుధవారం మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది.


గోడ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఏపీ మారిటైం బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా ఉంటుంది. తీరంలో కోత తీవ్రత, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా గోడ నిర్మాణ డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. వచ్చే నవంబరు నుంచి పనులు ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమని పవన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 13 , 2026 | 07:42 AM