చౌకడిపోల్లో కనిపించని కందిపప్పు
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:06 AM
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పు పంపిణీ ని ప్రభుత్వం పూర్తిగా మానుకుంది. కనీసం ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగ నెల అయిన జనవరిలో కూడా పీడీఎస్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ జరగకపోవడంతో చౌకడిపోల్లో ఏదీ కందిపప్పు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వంలో రేషన్ షాపుల్లో నిలిచిపోయిన సరఫరా
కూటమి పాలనలోను ఎదురుచూపులే
పండుగ రోజు జేబులకు చిల్లు
దివాన్చెరువు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పు పంపిణీ ని ప్రభుత్వం పూర్తిగా మానుకుంది. కనీసం ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగ నెల అయిన జనవరిలో కూడా పీడీఎస్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ జరగకపోవడంతో చౌకడిపోల్లో ఏదీ కందిపప్పు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం గతంలో బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేది. దాదాపు ఏడాదికిపైగా కందిపప్పు కనుమరుగైంది. గత ప్రభుత్వ హయాంలోనే కందిపప్పు పంపిణీ ఆగిపోయిందని, కూటమి వచ్చాక అయినా సరఫరా చేస్తారని ఆశిస్తే నిరాశే మిగిలిందని పలువురు అంటున్నారు. రాజానగరం మండలంలో 48 చౌకడిపోలు ద్వారా దాదాపు 36300 తెలుపు కార్డులుకు సరుకులు సరఫరా అవుతున్నాయి. ఈ కార్డులుకు ఒక్కొక్క దానికి కిలో వంతున కందిపప్పు అందజేయాలి. కానీ ఆవిధంగా జరగడంలేదు. పండుగనాడైనా పప్పుఅన్నం తినాలి కాబట్టి బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.120 ఉన్నా, ఎక్కువ ధర అయినా కొనక తప్పడం లేదని, అదే చౌకడిపోల ద్వారా అయితే కిలో రూ.67కే అందేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో శ్రద్ధ వహించి వచ్చే నెల నుంచైనా పీడీఎస్ దుకాణాల్లో కందిపప్పు విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.