సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా..‘అమలాపురం’ అప్గ్రేడ్
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:17 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పురపాలక సంఘాన్ని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమలాపురం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పురపాలక సంఘాన్ని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న అమలాపురాన్ని అప్గ్రేడ్ చేయడం ద్వారా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి 2024-25 వరకు ఆదాయ, వ్యయ వివరాలతోపాటు అమలాపురం మున్సిపాలిటీని అప్గ్రేడ్ కోసం ప్రతిపాదనలు సమర్పించారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఫస్ట్గ్రేడ్ మున్సిపాలిటీ ఉన్న జిల్లా కేంద్రమైన అమలాపురం పురపాలక సంఘాన్ని సెలక్షన్ గ్రేడ్గా అప్గ్రేడ్ చేయడానికి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయించాలన్న ప్రయత్నం నెరవేరడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోఉన్న కామనగరువు, పేరూరు, ఈదరపల్లి పంచాయతీ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీన ప్రక్రియ చేపట్టడం ద్వారా రానున్న రోజుల్లో కాకినాడ, రాజమహేంద్రవరం స్థాయిలో పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష దిశగా అమలాపురం అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యే ఆనందరావు కృషిని పలువురు అభినందించారు.