ఎర్రచందనం కేసులో వైసీపీ నేతకు జైలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:36 AM
శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
చంద్రగిరి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.ఎర్రావారిపాలెం మండలం యనమలవారిపల్లెకు చెందిన ఉటుకూరి చెంగల్రెడ్డి, తిమ్మసముద్రానికి చెందిన వెంకట్రెడ్డి 2015వ సంవత్సరంలో శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిపై భాకరాపేట స్టేషన్లో కేసు నమోదయ్యింది.చెంగల్రెడ్డిపై నేరం రువుజు కావడంతో తిరుపతి ఆర్ఎన్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి రెండేళ్ళ జైలు శిక్ష, రూ.20 వేల రూపాయల జరిమానా విఽధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సివుంటుందన్నారు. ఈ కీలకమైన కేసు విచారణ, పర్యవేక్షణ, కోర్టు లైజనింగ్లో కృషి చేసిన డీఎస్పీ ప్రసాద్, స్పెషల్ ప్రాసిక్యూటర్ అమరనారాయణ, అప్పటి ఎస్ఐ నెట్టి కంఠయ్య, ప్రస్తుత సీఐ సత్యనారాయణ, ఎస్ఐ కృష్ణయ్య, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ నరసింహులును ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. శిక్ష పడిన చెంగల్రెడ్డి భార్య రెడ్డెమ్మ ప్రస్తుతం ఎర్రావారిపాలెం ఇన్చార్జ్ ఎంపీపీగా వుండగా చెంగల్రెడ్డి గతంలో మండల వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయనపై పలు ఎర్రచందనం అక్రమ కేసులు నమోదయ్యాయి.