Share News

పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరం

ABN , Publish Date - Jun 06 , 2026 | 01:06 AM

పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు

పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరం
మొక్క నాటి నీరు పోస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి సెంట్రల్‌/రేణిగుంట, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుడా ఆధ్వర్యంలో శుక్రవారం రేణిగుంట మండలం తూకివాకం సమీపంలో నిర్వహించిన వన మహోత్సవంలో జేసీ గోవిందరావు, తుడా చైర్మన్‌ దివాకర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. మొక్కల సంరక్షణలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలని సూచించారు. ఈ సంవత్సరం ఎల్‌నినో కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రధానంగా చేపలవేట ఇబ్బందికరంగా మారి తీరప్రాంత జీవనోపాధులు దెబ్బతింటాయన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా సీడ్‌ పెల్లెట్స్‌ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారన్నారు. విత్తనాలను ఇలా నాటడం వల్ల వర్షాభావం ఉన్నా, నీరు తక్కువగా ఉన్నా మొక్కలు ఎక్కువకాలం జీవిస్తాయన్నారు. తిరుపతి, శేషాచల కొండల్లో ఉన్న చెట్ల కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని చెప్పారు. పిల్లలు చిన్నతనం నుంచే మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జేసీ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తుడా చైర్మన్‌ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ రక్షణకు యువత నడుం బిగించాలని సూచించారు.

Updated Date - Jun 06 , 2026 | 01:06 AM