అర్హుల ఓట్లు తొలగించం
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:33 AM
అర్హులైన ఓట్లు తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ స్పష్టంచేశారు. తన పర్యటనలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి, గాయత్రి నగర్.. ఐరాల మండలంలోని కాణిపాకం, చినకాంపల్లె, కొత్తపల్లి, వడ్డెర మాపల్లి పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు.
ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్
చిత్తూరు కలెక్టరేట్/ఐరాల (కాణిపాకం), జూలై 13 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ఓట్లు తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ స్పష్టంచేశారు. తన పర్యటనలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి, గాయత్రి నగర్.. ఐరాల మండలంలోని కాణిపాకం, చినకాంపల్లె, కొత్తపల్లి, వడ్డెర మాపల్లి పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. ‘సర్’ ప్రక్రియ ప్రగతిపై బీఎల్వోలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న ఈ ప్రక్రియ తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్కుమార్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 2002 జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా గుర్తింపు కార్డును బీఎల్వోలకు అందిస్తే తుది జాబితాలో పేర్లు చేరుస్తామన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈఆర్వో, తనకు తెలియజేయవచ్చని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మీ, నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్, ఐరాల తహసీల్దార్ రామకృష్ణ, బీఎల్వోలు పాల్గొన్నారు. ఇదిలావుండగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్కు చేరుకొని సర్ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్తో సమీక్షించారు.