ఏమిటీ గందరగోళం!
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:30 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి గందరగోళం నెలకొంది. పూటకో షెడ్యూల్ను ప్రకటిస్తుండడంతో స్థానిక అధికారుల్లో అయోమయం ఏర్పడుతోంది. ఈనెల 3, 4, 5 తేదీల్లో సీఎం పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గతనెల 28న అధికారుల సమీక్షలో ప్రకటించారు. అప్పుడే అంతర్గతంగా షెడ్యూల్ను కూడా విడుదల చేశారు.
సీఎం పర్యటనపై పూటకో షెడ్యూల్
స్థానిక ఽఅధికారుల్లో అయోమయం
తాజాగా 4,5 తేదీల్లో పర్యటిస్తారని ప్రకటన
కుప్పం, జులై 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి గందరగోళం నెలకొంది. పూటకో షెడ్యూల్ను ప్రకటిస్తుండడంతో స్థానిక అధికారుల్లో అయోమయం ఏర్పడుతోంది. ఈనెల 3, 4, 5 తేదీల్లో సీఎం పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గతనెల 28న అధికారుల సమీక్షలో ప్రకటించారు. అప్పుడే అంతర్గతంగా షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా ఈనెల 3వ తేదీ సాయంత్రం గుడుపల్లె మండలం పొగురుపల్లె వద్ద ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడలో కొన్ని పరిశ్రమ ప్రారంభోత్సవాలు, ఎంఎ్సఎంసీ పార్క్ ఎంఎ్సఎం పార్క్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని, ఇక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. 4న కంగుందిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి డీకేటీ పట్టాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. 5న శాంతిపురం మండలం కడపల్లె వద్ద పార్టీ శ్రేణులతో సమావేశమై, మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారని, సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని షెడ్యూల్ చేశారు.
పొగురుపల్లి ఊసేది?
అయితే బుధవారం సీఎం పర్సనల్ సెక్రటరీ ఆర్.కృష్ణ కపర్ధి పేరుతో ఒక షెడ్యూల్ వెలువడింది. ఇదే కాపీని స్థానిక అధికారులకు అధికారికంగా పంపారు. ఇందులో పర్యటనను 4, 5 తేదీలకు కుదించారు. పర్యటన ప్రధాన లక్ష్యమైన పొగురుపల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు, పార్కు ప్రారంభోత్సవాలు ఈ షెడ్యూల్లో పేర్కొనకపోవడం గమనార్హం. 5వ తేదీ సాయంత్రం గుడుపల్లె మండల పరిధిలోని పారిశ్రామికవాడకు సమీపంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని ఇందులో ఉంది. అది ఏ సమావేశం, ఎవరితో సమావేశం అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. తాజా షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి పర్యటన 4వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. శాంతిపురం, కుప్పం మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం కంగుంది బహిరంగ సభలో పట్టాల పంపిణీ చేస్తారు. 5వ తేదీ 10 గంటలకు ప్రారంభమయ్యే చంద్రబాబు పర్యటన పూర్తిగా శాంతిపురం మండలంలో కొనసాగుతుంది. ద్రావిడ వర్శిటీలో ఎవరితోనో తెలియని సమావేశంతో సాయంత్రం 5 గంటలకు ముగింపుకు వస్తుంది. ఈ షెడ్యూల్ నిజమైనదనుకుంటే అది కూడా వీలుకాని పరిస్థితి. జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ తుషార్ డూడీ అన్ని ప్రాంతాలతోపాటు పొగురుపల్లె పారిశ్రామికవాడను కూడా సందర్శించారు. అక్కడి బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈనెల 3,4,5 తేదీల్లో పర్యటన ఖరారైందని అధికారుల సమీక్షలో ఆయన ప్రకటించారు. సీఎం పర్యటన షెడ్యూల్లో ఏర్పడిన గందరగోళంతో స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.