వాహనాలు రయ్..రయ్
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:56 AM
మదనపల్లె బైపా్స రోడ్డు పూర్తికావడంతో వాహనాలు రయ్..రయ్ అంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇటు ములకలచెరువు-మదనపల్లె వరకు, మదనపల్లె-తిరుపతి రోడ్డులో భాకరాపేట వరకు జాతీయ రహదారి పూర్తయింది.
- మదనపల్లె బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి
- విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రహదారి
మదనపల్లె, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మదనపల్లె బైపా్స రోడ్డు పూర్తికావడంతో వాహనాలు రయ్..రయ్ అంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇటు ములకలచెరువు-మదనపల్లె వరకు, మదనపల్లె-తిరుపతి రోడ్డులో భాకరాపేట వరకు జాతీయ రహదారి పూర్తయింది. ఈ రెండు రోడ్లను కలుపుతూ పట్టణ ప్రవేశ మార్గం అమ్మచెరువుమిట్ట నుంచి తట్టివారిపల్లె నాలుగు రోడ్ల కూడలి వరకు రహదారి పూర్తయింది. దీంతో అప్పటి వరకూ అసంపూర్తిగా ఉన్న తట్టివారిపల్లె నాలుగు రోడ్ల కూడలి ఫ్లైవోవర్, ఆరోగ్యవరం సమీపంలోని ఐదో మైలు వద్ద ఫ్లైవోవర్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో అటు చిత్తూరు వైపు నుంచి, ఇటు అనంతపురం వైపు నుంచి, ఇంకోవైపు తిరుపతి నుంచి వచ్చే వాహనాలు పట్టణ శివారులోని నాలుగు రోడ్ల కూడలిలో కలుస్తున్నాయి. మరోవైపు మదనపల్లె మండలం సీటీఎంలోని ఫ్లైవోవర్(ఆర్వోబీ) కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో మదనపల్లె నుంచి వాల్మీకిపురం వెళ్లే మార్గంలో రైలు వెళ్తే గేటు పడేది. దీంతో నిమిషాల కొద్దీ వాహనాల నిరీక్షణకు చెక్ పడినట్లయింది. బైపా్స రోడ్డు, ఫ్లైవోవర్, సీటీఎం ఆర్వోబీలు పట్టణానికి తలమానికంగా మారాయి. పట్టణానికి అటు అంగళ్లు వరకు, ఇటు పాళెంకొండ వరకూ ఐదు కిలోమీటర్ల మేర రాత్రివేళ విద్యుత్ లైట్ల కాంతులతో వెలిగిపోతున్నాయి.