రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - May 30 , 2026 | 12:57 AM
కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
ఐరాల(కాణిపాకం), మే 29 (ఆంధ్రజ్యోతి): కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం ఎగువపాలకూరు ఎస్సీ కాలనీకి చెందిన టి.సుధా కుమారుడు అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఆమె కుమారుడిని చూడటానికి గ్రామానికి చెందిన హేమాద్రి అలియాస్ చంటితో కలసి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. చిగరపల్లె జాతీయ రహదారి వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న ఇనుప సైన్ బోర్డును బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమాద్రి అక్కడికక్కడే మృతి చెందగా, తలకు తీవ్ర గాయమైన సుధా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.