ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ సంక్షేమ బోర్డుకు తిరుపతి కలెక్టరు
ABN , Publish Date - May 14 , 2026 | 12:16 AM
రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటయిన సంక్షేమ బోర్డుకు తిరుపతి జిల్లా కలెక్టరు వెంకటేశ్వర్ను సభ్యుడిగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
కలికిరి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటయిన సంక్షేమ బోర్డుకు తిరుపతి జిల్లా కలెక్టరు వెంకటేశ్వర్ను సభ్యుడిగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణకు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర స్థాయి సంక్షేమ బోర్డును 2025 ఫిబ్రవరి 14 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో చట్టబద్దమైన అవసరాలను గుర్తించడానికి నాలుగవ కేటగిరీలో కొంతమంది సభ్యులను నామినేట్ చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. తాజాగా బుధవారం ఐదుగురిని బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నామినేట్ చేయగా అందులో తిరుపతి జిల్లా కలెక్టరుకు చోటు దక్కింది. రాయలసీమ రీజియన్కు సంబంధించిన ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. తిరుపతి కలెక్టరుతోపాటు ఆంధ్రా రీజియన్కు విశాఖపట్నం కలెక్టరును నామినేట్ చేయగా మరో ముగ్గురిని సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రజా సంఘాల నుంచి నామినేట్ చేస్తూ మహిళా శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.