టిడ్కో డిపాజిటర్లకు సొమ్ము వాపస్
ABN , Publish Date - May 14 , 2026 | 01:19 AM
తిరుపతిలో టిడ్కో హౌసింగ్ డిపాజిటర్లకు సొమ్ము వాపస్ చేయడం మొదలైంది.బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో రీఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు.
తిరుపతి సెంట్రల్, మే 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో టిడ్కో హౌసింగ్ డిపాజిటర్లకు సొమ్ము వాపస్ చేయడం మొదలైంది.బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో రీఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ టిడ్కో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2472 మంది డిపాజిటర్ల నుంచి ప్రభుత్వం దాదాపు రూ.5 కోట్లు కట్టించుకున్నట్లు చెప్పారు. అయితే తరువాత వచ్చిన వైసీపీ సర్కారు టిడ్కో ప్రాజెక్టును రద్దు చేసినప్పటికీ డిపాజిటర్లకు వారు చెల్లించిన నగదును తిరిగివ్వలేదన్నారు. డిపాజిటర్లకు సొమ్ము రీఫండ్ చేయాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా వారు అంగీకరించారన్నారు. ఇన్చార్జి కమిషనర్ శారదాదేవి మాట్లాడుతూ 2472 మందిలో డబుల్ పేమెంట్లు పోనూ ఇప్పటి వరకు 1890 మంది మిగిలారన్నారు. వీరిలో 20 మంది ఆధార్ కార్డులు సరిపోలేదని చెప్పారు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. ఇది పూర్తయిన వెంటనే మూడు దశల్లో డిపాజిటర్లకు వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని తెలిపారు. ఏపీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిడ్కో ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం టిడ్కో ప్రాజెక్టు రద్దు చేయడంతో డిపాజిటర్లకు వారి అమౌంట్ రీఫండ్ చేయడం సంతోషకరమన్నారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య,రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, సూపరింటెండెంట్ రాజశేఖర్, హౌసింగ్ స్పెషలిస్టు డాక్టర్ కామరాజు, మాజీ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.