పీఎండీఎస్ విధానాన్ని ప్రోత్సహించాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:13 AM
ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్(పీఎండీఎస్) విధానాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ నిశాంత్కుమార్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ మొరవ వడ్డిపల్లె వద్ద రైతు ఎల్లప్ప పీఎండీఎస్ విధానంలో సాగుచేసిన వేరుశనగ, కంది, ఆముదం, అలసంద, ఎర్ర తోటకూర, చిక్కుడు, పెసలు, మినుములు, సజ్జ పంటలను ఆయన పరిశీలించారు.
పీలేరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్(పీఎండీఎస్) విధానాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ నిశాంత్కుమార్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పీలేరు మండలంలో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ మొరవ వడ్డిపల్లె వద్ద రైతు ఎల్లప్ప పీఎండీఎస్ విధానంలో సాగుచేసిన వేరుశనగ, కంది, ఆముదం, అలసంద, ఎర్ర తోటకూర, చిక్కుడు, పెసలు, మినుములు, సజ్జ పంటలను ఆయన పరిశీలించారు. తక్కువ వర్షపాతంతో ఎక్కువ లాభం చేకూర్చే పీఎండీఎస్ విధానంపై జిల్లా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నందున వచ్చే సీజన్లో జిల్లావ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పీఎండీఎస్ విధానంలో వివిధ పంటలు సాగు అయ్యేలా చూడాలన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ తన నాలుగు ఎకరాల పొలంలో విత్తుకునేందుకు తయారు చేసిన విత్తన గుళికలను పరిశీలించారు. రైతుతో కలిసి పొలంలో విత్తనాలు చల్లారు. సబ్సిడీపై అందుతున్న విత్తనాలను సద్వినియోగం చేసుకుని బీడు, ఖాళీ భూముల్లో అనుబంధ పంటలు సాగుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తలపుల గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. పీఎంశ్రీ పథకానికి ఎంపికైన పీలేరులోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. క్రీడా మైదానం, కిచెన్ గార్డెన్, ఫెన్సింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన పీలేరు మండలం కావలిపల్లె పంచాయతీ ఎంసీ పాళెం గ్రామం వద్ద ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న ఇంకుడు గుంత పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి హరిప్రియ, డ్వామా పీడీ వెంకటరత్నం, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్లై, ఏపీ సీఎన్ఎ్ఫ డీపీఎం వెంకటమోహన్, ఏడీలు మజీద్ అహ్మద్, కరుణాకర్ రెడ్డి, ఏపీసీ అనూరాధ, ఎంపీడీవో శివశంకర్, తహసీల్దారు శివకుమార్, ఎంఈవోలు బాబు నాయక్, పద్మావతమ్మ, ఏఈలు పాల్గొన్నారు.