Share News

‘సర్‌’కు యంత్రాంగం సిద్ధం

ABN , Publish Date - May 22 , 2026 | 01:40 AM

జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోందని డీఆర్వో మోహన్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఆర్వో మీటింగ్‌ హాలులో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘సర్‌’కు యంత్రాంగం సిద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో మోహన్‌కుమార్‌

మ్యాపింగ్‌లో చిత్తూరుకు తృతీయస్థానం

చిత్తూరు కలెక్టరేట్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోందని డీఆర్వో మోహన్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఆర్వో మీటింగ్‌ హాలులో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులను ఓటరు జాబితా నుంచి తప్పించకుండా, అనర్హులకు చోటు కల్పించకూడదన్నది సర్‌ లక్ష్యమన్నారు. జూన్‌ 15 నుంచి జూలై 14వ తేది వరకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్ళి ఓటరు సర్వే చేపడతారన్నారు. బీఎల్వోలకు సహకారంగా రాజకీయ పార్టీలు బూత్‌లెవల్‌ ఏజెంట్ల జాబితాను ఇవ్వాలని కోరారు. బీఎల్‌ఏల సహకారంతో వందశాతం స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీకి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అక్రమ, నకిలీ, మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా కృషిచేసి జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని వివరించారు. సర్‌లో భాగంగా చేపట్టిన మ్యాపింగ్‌లో 71.94శాతం పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో చిత్తూరు జిల్లా తృతీయస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 15,80,275 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సురేంద్రకుమార్‌, ఉదయ్‌కుమార్‌, అట్లూరి శ్రీనివాసులు, బాలసుబ్రహ్మణ్యం, గంగరాజు, పరదేశి, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ రాజేంద్ర, పన్నీర్‌సెల్వం, ఐటీ విభాగం ప్రతినిధి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 01:40 AM