గుప్తనిధుల ముఠా హల్చల్
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:05 AM
ములకలచెరువు, మండలంలోని సోంపాళ్యంలో ఉన్న పురాతన చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం రాత్రి గుప్త నిధుల దొంగలుపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపేసి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు రాతి కల్యాణ మండపం లోపల పైభాగంలో ఉన్న మొగ్గలాంటి శిల్పాన్ని పగులగొట్టారు.
ములకలచెరువు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని సోంపాళ్యంలో ఉన్న పురాతన చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం రాత్రి గుప్త నిధుల దొంగలుపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపేసి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు రాతి కల్యాణ మండపం లోపల పైభాగంలో ఉన్న మొగ్గలాంటి శిల్పాన్ని పగులగొట్టారు. సోంపాళ్యంలో 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి గాంచింది. ఆలయం లోపల శిలలపై చెక్కిన శిల్పాలు ఉన్నాయి. రాతి కల్యాణ మండపం, రాతి రథాలు ఉన్నాయి. ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో గుప్త నిధుల ముఠా ఆలయంలోకి ప్రవేశించింది. తొలుత కరెంటు స్తంభం వద్ద వైరును కట్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం రాతి కల్యాణ మండపంలో పై భాగంలో ఉన్న మొగ్గలాంటి శిల్పాన్ని ధ్వంసం చేశారు. గుప్తనిధులు ఉంటాయని భావించిన దుండగులు శిల్పాన్ని ముక్కలు చేశారు. ఈ విషయమై వాచ్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి పురావస్తుశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రతాప్ వేర్వేరుగా ధ్వంసమైన శిల్పాన్ని పరిశీలించారు. కాగా, 2009లో ఒకసారి, 2014లో మరోసారి, ఇప్పుడు ఇంకోసారి గుప్త నిధుల ముఠా చోరీలకు ప్రయత్నించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఆలయంలో రాత్రి వేళల్లో కాపలా ఉంచాలని కోరుతున్నారు.