ఉమ్మడి జిల్లాకే తొలి జాతర
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:04 AM
సీటీఎంలో మంగళవారం జరిగిన నలవీర గంగాభవానీ అమ్మవారి జాతర.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మొదటిది. ఏటా జాతర సంరంభం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఆ తర్వాత అంతటా జాతర నిర్వహించడం ఆనవాయితీ.
సీటీఎంకు పోటెత్తిన భక్తులు
మదనపల్లె అర్బన్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): సీటీఎంలో మంగళవారం జరిగిన నలవీర గంగాభవానీ అమ్మవారి జాతర.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మొదటిది. ఏటా జాతర సంరంభం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఆ తర్వాత అంతటా జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సీటీఎంలో జరిగిన జాతరకు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కొత్తవారిపల్లె, సీటీఎం, సీటీఎం క్రాస్, దుబ్బిగానిపల్లె, పోతబోలు గ్రామాల ప్రజలు బోనాలను సమర్పించారు. గంటల కొద్దీ క్యూలైన్లో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. పొరుగు జిల్లాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచీ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఊరేగింపుగా వచ్చి గంగమ్మకు దీలు, బోనాలు సమర్పించారు. ఆలయ నిర్వాహకులు సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం రూ. 50లు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. చాందినీ, టెంకాయ పట్లబండ్ల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.