హనుమంత, గజ వాహనాలపై వేణుగోపాలుడి దివ్యతేజం
ABN , Publish Date - Jun 12 , 2026 | 02:04 AM
కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం హనుమంత, రాత్రి గజ వాహనాలపై ఉత్సవర్లు భక్తులకు దర్శనమిచ్చారు.
వెదురుకుప్పం, జూన్ 11(ఆంధ్రజ్యోతి): కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం హనుమంత, రాత్రి గజ వాహనాలపై ఉత్సవర్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పూజా కైంకర్యాల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీరామచంద్రుడిగా అలంకరించారు. హనుమంత వాహనంపై ఆశీనులైన వేణుగోపాలస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అనంతరం ఉత్సవర్లకు ఆస్థానం జరిగింది. సాయంత్రం వసంతోత్సవం నిర్వహించారు. పసుపు, చందనం, పన్నీరు మిశ్రమాన్ని అర్చకులు ఉత్సవమూర్తులపై చల్లి, మాడవీధి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊంజల్ సేవ అనంతరం.. ఉత్సవర్లను గజ వాహనంపై అధిష్ఠింపచేసి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులిచ్చారు. వాహన సేవల ముందు కళాబృందాల భజనలు అలరించాయి. ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, ప్రధాన అర్చకులు గోపాలాచార్యులు, శబరినాథ్, చక్రవర్తి, కిరణ్కుమార్ పాల్గొన్నారు.