నేటి నుంచి టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:43 AM
జిల్లాలో సోమవారం నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
చిత్తూరు సెంట్రల్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. చివరిసారిగా ఆదివారం డీఈవో రాజేంద్రప్రసాద్, ఆయా అధికారులు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా డెస్క్లు, లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, వాష్రూంలు ఉన్నాయా అనేది చూశారు. ఏప్రిల్ ఒకటో తేది వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 129 కేంద్రాల్లో 23,095 మంది (బాలురు 12,105, బాలికలు 10,990) విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 93 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 11 ఫ్లయింగ్.. 43 సిట్టింగ్ స్క్వాడ్స్, 37 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల జిల్లా పరిశీలకుడిగా రాష్ట్ర సమగ్రశిక్షలో ఎన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగంను నియమించారు. గతంలో ఈయన ఇక్కడ డీఈవోగా పనిచేశారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలూ..
సోమవారం నుంచి ఈనెల 28వ తేది వరకు జరిగే ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలను 1063 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికి 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో సిట్టింగ్ స్క్వాడ్ నియమించారు. సలహాలు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, సమస్యలు తెలియజేసేందుకు వీలుగా డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (90321 85001) ఏర్పాటు చేశారు.