ఇంటింటికీ టీడీపీ
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:25 AM
సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించిన నేతలు, శ్రేణులు రామకుప్పంలో పాల్గొన్న నారా భువనేశ్వరి తొలిరోజు పూతలపట్టు ఎమ్మెల్యే తప్ప అందరూ హాజరు
చిత్తూరు అర్బన్, జూలై 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ‘రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి సంక్షేమం’ పేరిట ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 45 రోజుల పాటు ప్రజల్లో తిరగనున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం మొదలైంది. తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, పెంచిన పింఛన్లు.. తదితర పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులనూ ప్రజలకు వివరించారు. పూతలపట్టు ఎమ్మెల్యే తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామకుప్పం మండలం ఎస్.గొల్లపల్లె పంచాయతీలోని కావలి మడుగు, పీఎంకే తండాలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇంటింటికి టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. పీకేఎం ఉడా చైర్మన్ సురే్షబాబు తదితరులు పాల్గొన్నారు. శాంతిపురంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, స్థానిక నాయకులు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు.
పెద్ద పంజాణి మండలం శంకరరాయలపేట, శివాడి, నిడిగుంట, ముదరంపల్లె, అమ్మిరాజుపల్లె, బొమ్మరాజుపల్లెల్లో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు, బోర్వెల్ తదితర వాటిని ఎమ్మెల్యే ప్రారంభించారు.
చిత్తూరు నియోజకవర్గం దొడ్డిపల్లె సప్తకన్నికలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూజలు చేసి.. ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు నివాసానికి వెళ్లి కొంతసేపు అక్కడే ఉన్నారు. ఎస్టేట్లోని అన్నా క్యాంటీన్లో అందరితో కలిసి భోజనం చేశారు.
ఐరాల మండలం కాణిపాకంలో మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబునాయుడు, పోల్ మేనేజ్మెంట్ కన్వీనర్ గిరిధర్ నాయుడు, ఆలయ చైర్మన్ మణినాయుడు తదితరులు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఇంటింటికీ తిరిగారు.
వెదురుకుప్పం మండలం పచ్చికాపలంలో ఎమ్మెల్యే థామస్ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచిపెట్టారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చామన్నారు. జీడీనెల్లూరు మండలం మిట్టకొత్తూరు, ఎస్ఆర్పురం మండలం ఎగువ కండ్రిగలో, కార్వేటినగరం మండలంలోనూ నేతలు ఇంటింటికీ వెళ్లి పథకాలను ప్రచారం చేశారు.
నగరి నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి జిల్లా పుత్తూరులోని 9వ వార్డులో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు.