తాళాలు వేసిన.. ఖాళీగా ఉన్న ఇళ్లను మరోసారి పరిశీలించండి
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:19 AM
తాళాలు వేసి ఖాళీగా ఉన్న 76,412 గృహాలు, తాళాలు వేసిన 730 ఇళ్లను ఈనెల 6వ తేదీలోగా పునఃపరిశీలించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. జన గణనకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని మీటింగ్ హాలు నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జనగణనపై అధికారులకు కలెక్టర్ ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తాళాలు వేసి ఖాళీగా ఉన్న 76,412 గృహాలు, తాళాలు వేసిన 730 ఇళ్లను ఈనెల 6వ తేదీలోగా పునఃపరిశీలించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. జన గణనకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని మీటింగ్ హాలు నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జిల్లాలో పారదర్శకంగా జనగణన నిర్వహించాలన్నారు. తాజా సమాచారం మేరకు 18,91,890కిగాను 17,36,195 గృహాలు (91.8 శాతం) సర్వే పూర్తయిందని చెప్పారు. ఇక్కడ 6,00,246 మంది జనాభా ఉండగా 6,14,328 (102.35శాతం) గణన పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి జనగణన పూర్తిచేసిన ఇళ్ల డోర్ నెంబర్లు, నమోదు చేసిన వివరాలు, ఆన్లైన్లో నమోదైన వివరాలను రికార్డులతో సరిపోల్చాలన్నారు. పెండింగ్లో వున్న సర్వే వివరాలను త్వరితగతిన పూర్తిచేయాలని మండల స్పెషలాఫీసర్లను ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మూతబడ్డ, తాళాలు వేసిన గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్యుమరేటర్లు ఇచ్చిన వివరాలను పరిశీలించాలన్నారు. 2011 జనాభాతో పోలిస్తే ఎక్కడైనా ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తే తహసీల్దార్లు వెంటనే ఆ ప్రాంతాల్లో పునఃపరిశీలించాలన్నారు. ఈనెల 7వ తేది నుంచి రెండు వారాల పాటు యోగా కార్యక్రమాలు, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని సూచించారు.