నెయ్యి సేకరణలో నిబంధనల ఉల్లంఘనలపై అధ్యయనం
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:38 AM
శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కొనుగోలుకు టీటీడీ అవలంబిస్తున్న విధానాలను ఏకసభ్య కమిషన్ సారధి దినే్షకుమార్ పరిశీలించారు. ఇందులో భాగంగా బుధవారం టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఉమా శంకర్ను కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు.
టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎంను విచారించిన ఏకసభ్య కమిషన్
తిరుపతి(టీటీడీ), మార్చి 11 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కొనుగోలుకు టీటీడీ అవలంబిస్తున్న విధానాలను ఏకసభ్య కమిషన్ సారధి దినే్షకుమార్ పరిశీలించారు. ఇందులో భాగంగా బుధవారం టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఉమా శంకర్ను కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. ఈ సందర్భంగా నెయ్యి సేకరణ సమయంలో టెండర్లలో పాల్గొనే సంస్థలు సమర్పించే దస్త్రాలను ఏ విధంగా నిర్థారించుకుంటారనే సమాచారం తీసుకున్నట్లు సమాచారం. టెండరు పిలిచే సమయంలో 2019 నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పుల వివరాలు తీసుకున్నారు. అలాగే టెండరు పిలిచిన తర్వాత అందులో ప్రమాణాలు పొందుపర్చే సమయంలో ఎక్కడైనా సొంతంగా మార్పు చేసేందుకు అవకాశాలున్నాయా అనే అంశాన్ని అడిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారి టెండరు పిలిచిన తర్వాత మళ్లీ అందులో పొందుపర్చిన నిబంధనలు మార్చేందుకు ఎవరి అనుమతి అవసరం ఉంటుందనే సమాచారాన్ని సేకరించారు. ప్లాంట్లలో నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం పరిశీలించే సమయంలో పాటించే ప్రమాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెయ్యితోపాటు టీటీడీలో వివిధ ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పదార్థాల సేకరణ విధానాన్ని తెలుసుకున్నట్లు సమాచారం.ఇప్పటి వరకు కేవలం దస్త్రాలకే పరిమితమైన ఏకసభ్య కమిషన్ బుధవారం నుంచి అధికారుల నుంచి తనకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టింది.