ఆహుతైన శ్రీసిటీ బస్సు
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:52 AM
షార్ట్ సర్క్యూట్తో ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. శ్రీసిటీలోని ఓ పరిశ్రమకు చెందిన ఈ బస్సు శనివారం ఉదయం 7 గంటల సమయంలో నైట్ డ్యూటీ ముగించుకొని తిరిగి వెళ్లే సుమారు 30 మంది కార్మికులను తీసుకొని బయలుదేరింది.
తడ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : షార్ట్ సర్క్యూట్తో ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. శ్రీసిటీలోని ఓ పరిశ్రమకు చెందిన ఈ బస్సు శనివారం ఉదయం 7 గంటల సమయంలో నైట్ డ్యూటీ ముగించుకొని తిరిగి వెళ్లే సుమారు 30 మంది కార్మికులను తీసుకొని బయలుదేరింది. మార్గమధ్యంలోని శ్రీసిటీ జీరోపాయింట్ దాటిన తరువాత పెట్రోల్ బంకుకు సమీపంలో జాతీయ రహదారి వద్ద బస్సు ఇంజన్లో మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే కార్మికులను అప్రమత్తం చేసి కిందకు దించేశాడు. అప్పటికే బస్సు లోపల భాగానికి మంటలంటుకున్నాయి. అందరూ దిగిపోయాక మంటలు ఎగిసిపడి బస్సు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుంది. దీంతో చెన్నై-నెల్లూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ తరువాత మంటలను అదుపుచేసి బస్సును పక్కకుతీసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదస్థలానికి సమీపంలో పెట్రోల్ బంకు ఉండటంతో కొంత భయాందోళన వ్యక్తమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.