సర్.. నలుగురికి షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:06 AM
సర్ ప్రక్రియలో భాగంగా జూన్ 30 నాటికి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో 20 శాతం కంటే తక్కువ ఉన్న నలుగురు తహసీల్దార్లకు (ఏఈఆర్వోలు) కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం షోకాజ్ నోటీసులిచ్చారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియలో భాగంగా జూన్ 30 నాటికి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో 20 శాతం కంటే తక్కువ ఉన్న నలుగురు తహసీల్దార్లకు (ఏఈఆర్వోలు) కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం షోకాజ్ నోటీసులిచ్చారు. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. కుప్పం మండలం కంగుంది ఆర్ఎక్స్ దేవరాజపురం పోలింగ్ స్టేషన్ పరిధిలో 5.77 శాతం, పెద్దకాల్వలో 7.84, శాంతిపురం మండలం కోనేరుకుప్పంలో 12.38, కొర్లగుంటలో 19.66, రామకుప్పం మండలం వీర్నమల తాండాలో 18, గంగాధరనెల్లూరు మండలం ఎన్టీఆర్ కాలనీ పోలింగ్ స్టేషన్ పరిధిలో 19.19 శాతం చొప్పున డిజిటలైజేషన్ అయింది. సంబంధిత ఏఈఆర్వోలుగా ఉన్న తహసీల్దార్లకు ఈ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
‘సర్’ పరిశీలనకు అధికారుల నియామకం
‘సర్’ ప్రక్రియలో ఎనుమ్యరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రగతి పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అధికారులను.. నాలుగు జిల్లాలకు కేటాయించింది. ఈనెల 9 నుంచి 12వ తేదీ మధ్య నవీన్ కుమార్, ఎం.అనిత కుక్రేజా, శ్రీఉదిత్ ఆయా జిల్లాల్లో పర్యటిస్తారు. కలెక్టర్లతో డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్షిస్తారు. అతి తక్కువ డిజిటలైజేషన్ జరిగిన పోలింగ్ స్టేషన్లను పరిశీలించి కారణాలను విశ్లేషిస్తారు.